దారులన్నీ ఏకమై కొండగట్టు నిండుతున్నది. రాష్ట్ర నలుమూలల నుంచీ తరలివస్తున్న వేలాది మంది దీక్షాపరులతో ఇప్పటికే కాషాయమయమైంది. హనుమాన్, రామనామ సంకీర్తనలతో మార్మోగిపోతున్నది. ఆంజనేయస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న చిన్న జయంతి ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు సుమారు 20వేల మంది అంజన్న స్వాములు మాల విరమణ చేసి స్వామివారిని దర్శించుకొని వెళ్లారు. శుక్రవారం చిన్న జయంతి సందర్భంగా నిన్న రాత్రి వరకు గట్టుపైకి వేలాదిగా చేరుకున్నారు. ఉదయమే దీక్ష విరమించి వెనుదిరగనున్నారు.
మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా దీక్షాపరులు రాష్ట్ర నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచీ తరలివస్తున్నారు. మధ్యాహ్న సమయంలో చెట్లు, ఇతర ప్రాంతాల్లో సేదతీరుతూ ఉదయం, సాయంత్రం మాల విమరణకు బారులు తీరుతున్నారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయ పరిసరాలు బోసిపోగా, అర్ధరాత్రి వరకు కొండగట్టు పరిసరాలు పోటెత్తాయి. అర్చకులు గురువారం ఉదయం నాలుగు గంటలకు ఆలయాన్ని తెరిచి, దీక్ష విరమణ కార్యక్రమాన్ని ప్రారంభించగా భక్తులు ఒక్కసారిగా తరలివచ్చారు. ఉదయం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు నిరాటంకంగా 8 బ్యాచులు మాల విరమణ చేశాయి. స్వామి వారి జయంతి రోజునే మాల విరమణ చేయాలని లక్షలాది మంది భక్తులు కొండగట్టుకు చేరుకుంటారు. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి వరకు కొండంతా భక్తులతో నిండిపోయింది. రాత్రి 12 గంటల తర్వాత నుంచి శుక్రవారం ఉదయం వరకు మాల విరమణకు బారులు తీరారు.