సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. నగరంలోని బేగంపేటలోని హోటల్ ప్లాజాలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగం సాధించిన విద్యార్థులకు నేడు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ లచ్చిరాం భుక్యా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు అవకాశాలు ఉపయోగించుకుని ఉద్యోగాలు సాధించుకోవడం అభినందనీయమన్నారు. గత ప్రభుత్వాలు ఎస్సీలను పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. లచ్చిరాం భుక్యా మాట్లాడుతూ.. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 16కు పైగా కోర్సులలో శిక్షణ ఇప్పించి ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం రాని ఎస్సీ విద్యార్థులకు ఫిన్సింగ్ స్కూల్ ద్వారా జావా నెట్వర్కింగ్లో శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.