జిల్లా ఆసుపత్రి లో గైనకాలజిస్ట్ లు లేకపోవడం వల్ల ప్రసవం కోసం వచ్చే మహిళలను కరీంనగర్ , ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు పంపుతున్నారని ఫిర్యాదులు అధికంగా వచ్చిన నేపథ్యంలో శుక్రవారం సిరిసిల్ల నియోజకవర్గ శాసన సభ్యులు కేటీఆర్ ఆకస్మికంగా జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసారు . జిల్లా సంయుక్త కలెక్టర్ , జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు , వైద్యులు , సిబ్బంది , జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో జిల్లా ఆసుపత్రిలో సమావేశమై ఆసుపత్రిపై వస్తున్న ఫిర్యాదులకు గల కారణాలు, ఆసుపత్రి లో వైద్యులు , ముఖ్యంగా గైనకాలజిస్ట్ లు , సిబ్బంది కొరత , కావాల్సిన మౌలిక వసతులు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు . వైద్యులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు . త్వరలోనే జిల్లా ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం CT మిషన్ ను ఏర్పాటు చేస్తామన్నారు . అన్ని జిల్లా కేంద్రాలలో 300 పడకల సూపర్ స్పెషా లిటి ఆసుపత్రి ఉండాలన్నది సిఎం విజన్ అన్న కేటీఆర్... ప్రజా ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసి .. రోగులందరికీ మెరుగైన వైద్య సేవలందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు .
ఈ సందర్భంగా కేటీఆర్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి తో ఫోన్ లో మాట్లాడి అంకితభావం గల 4 గురు ఔత్సాహిక గైనకాలజిస్ట్ లను జిల్లా ఆసుపత్రి లో నియామకం చేయాలని కోరారు .వారు కనీసం ఇక్కడ రెండు సంవత్సరాలు పని చేసేలా చూడాలన్నారు. ప్రసూతి విభాగంను సందర్శించి ... వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.