ఉల్లి ధర కొండెక్కుతోంది.. కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తోంది. వారం రోజుల వ్యవధిలో ఉల్లి ధర అమాంతం పెరిగింది. పదిరోజుల క్రితం కిలో ఉల్లిగడ్డల ధర రూ.16 నుంచి రూ.20 ఉండగా.. వారం రోజుల్లో రేటు రూ. 45కు చేరింది. ధర ఇంకా పెరిగే అవకాశముందన్న ప్రచారం ప్రజలను భయపెడుతోంది. రేటు మరింత పెరగకముందే ఎక్కువ మొత్తంలో ఉల్లిగడ్డలు కొనుక్కోవాలని కొందరు భావిస్తోంటే.. మరికొందరు మాత్రం ఇంత ధర పెట్టి కొనేందుకు వెనకాడుతున్నారు. మరోవైపు ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ అవి సాగుచేస్తున్న రైతులకు మాత్రం ఏ ఉపయోగం కనిపించడం లేదు. వర్షాలు, వరదల కారణంగా పంట దిగుబడి దెబ్బతినడమే దీనికికారణమవుతోంది.
ఉల్లగడ్డ ధర అమాంతం పెరగడానికే వర్షాలు, రదలే కారణమవుతున్నాయి.. మహారాష్ట్ర భారీ వరదలు దీనిపై తీవ్ర ప్రభావం చూపాయి. ఉల్లిని ప్రధానంగా పండించే మహారాష్ట్రలో అతి భారీ వర్షాలు, వరదల కారణంగా పంట పూర్తిగా దెబ్బంది. దీంతో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. బహిరంగ మార్కెట్లో ఉల్లిగడ్డల లభ్యత తగ్గిపోయింది. పదిరోజుల క్రితం రూ.100కు ఐదారు కేజీల ఉల్లిగడ్డలు లభిస్తుండగా.. ఇప్పుడు వందకు రెండు కేజీలు ఇచ్చేందుకు కూడా వ్యాపారులు ఇష్టపడడం లేదు. పెరిగిన రేట్లు ఉల్లి వినియోగంపై ప్రభావం చూపిస్తున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిగడ్డల పేరు చెప్పగానే కర్నూలు జిల్లా గుర్తొస్తుంది. జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున రైతులు ఉల్లిసాగు చేస్తారు. కానీ ఇక్కడి రైతులకు ఉల్లిగడ్డలు నష్టాలే మిగిలిస్తున్నాయి. సాధారణంగా ధర పెరిగితే రైతులు లాభపడాలి. కానీ ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నా రైతులకు ఏ మాత్రం ప్రయోజనం కలగడం లేదు. దీనికి కారణం జిల్లాలో ఈ సారి దిగుబడి తగ్గడమే. మార్కెట్లో డిమాండ్కు సరిపడా దిగుబడి లేకపోవడంతో పెరిగిన ఉల్లిపాయ ధరలు చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు.