మొదట ఈటల రాజేందర్, తర్వాత రసమయి బాలకిషన్... తాజాగా మాజీ హోం మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి సీఎం కేసీఆర్పై తన అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి సీఎం కేసీఆర్ మాట తప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పానని, అయితే కౌన్సిల్లో ఉండు.. మంత్రి పదవి ఇస్తా అని కేసీఆరే అన్నారని నాయిని సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా తన అల్లుడికి కూడా ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని నాయిని చెప్పారు. తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తారంటున్న వ్యాఖ్యలపై నాయిని స్పందించారు. ఆ పదవి తనకు వద్దని, అందులో రసం లేదని నాయిని తన అసంతృప్తిని వెళ్లగక్కారు. సీఎం కేసీఆర్ తమ ఇంటికి పెద్ద అని, తామంతా ఓనర్లమేనని అన్నారు. కిరాయిదార్లు ఎంత కాలం ఉంటారో వాళ్లిష్టమని నాయిని అన్నారు.