మంగళవారం తెలంగాణ అసెంబ్లీకి మంత్రి కేటీఆర్ను కలిసేందుకు వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోడెల మరణానికి కారణం.. ఆయన నమ్ముకున్న టీడీపీయేనని అన్నారు. గత కొద్ది రోజులుగా కోడెలను చంద్రబాబు సమావేశాలకు పిలవడంలేదని, కోడెలకు కనీసం నైతిక మద్దతు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కోడెలపై ప్రభుత్వం కేసులు పెట్టలేదని, అయన బాధితులైన టీడీపీ కార్యకర్తలే ఫిర్యాదులు చేశారన్నారు. ప్రభుత్వం సుమోటోగా తీసుకుని కోడెలపై కేసులు పెట్టి ఉంటే మమ్మల్ని నిందించాలన్నారు. తాము ఎవరిపై ఫేక్ కేసులు పెట్టమని, ఎవరైనా తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టమని కాటసాని స్పష్టం చేశారు. జగన్.. కేసీఆర్ సర్కార్ను కాపీకొడుతున్నారని అనడం సరికాదని, జగన్ ఆయన తండ్రి అడుగుజాడల్లో పాలన చేస్తున్నారని కాటసాని అన్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర వల్ల రాయల తెలంగాణ ఆగిపోయిందన్నారు. ఇప్పటికీ అక్కడి ప్రజలకు తెలంగాణాలో కలవాలనే ఉందన్నారు. గోదావరి, కృష్ణా అనుసంధానం చేస్తే రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రం విడిపోయాక కూడా రాయలసీమకు అన్యాయమే జరుగుతోందన్నారు.