జీహెచ్ఎంసీ పరిధిలో ఈ నెల 24 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో చీరల పంపిణీ చేస్తామన్నారు. ఈ నెల 24 నుంచి 30 వరకు చీరల పంపిణీ ప్రక్రియ కొనసాగనుందని ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీకి 15 లక్షల 40 వేల చీరలు మంజూరయ్యాయనీ, జీహెచ్ఎంసీ, పౌరసరఫరాల శాఖ సమన్వయంతో చీరల పంపిణీ జరుగుతుందని మంత్రి అన్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో బతుకమ్మ చీరల పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం పట్ల మహిళలు పూర్తి సంతృప్తిగా ఉన్నారు. దసరా పర్వదినాన ఆడపడుచులందరూ కొత్త చీరలు ధరించి, పండుగను సంతోషంగా జరుపుకోవాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ చీరలు నేచే కార్యక్రమాన్ని సిరిసిల్ల నేత కార్మికులకు అప్పగించి వారికి కూడా ప్రభుత్వం ఉపాధి కల్పిస్తోంది.