సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉపఎన్నిక నోటిఫికేషన్ ను రిటర్నింగ్ అధికారి చంద్రయ్య సోమవారం విడుదల చేశారు. అక్టోబర్ 21న జరగనున్న పోలింగ్ కు నేటి నుండి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ లకు 30న చివరితేదీ కాగా, అక్టోబర్ 1 నామినేషన్ల పరిశీలనకు, 3న ఉపసంహరణకు అన్ని ఏర్పాటు చేశారు. నేటి నుండి స్వీకరించనున్న నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రిటర్నింగ్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ కార్యాలయం 100 మీటర్ల పరిధిలో నిషేధ ఆజ్ఞలు కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నామినేషన్ పత్రాలు దాఖలకు అభ్యర్థితో పాటు మరో నలుగురు సభ్యులను మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను తొలగించి దివంగత నాయకుల విగ్రహాలకు ముసుగు కప్పారు.