రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలానికి చెందిన 27 ఏళ్ల లింగం అనే వ్యక్తికి 2016లో వివాహం అయింది. మనస్పర్థల కారణంగా భార్య కొద్దిరోజులకే పుట్టింటికి వెళ్లిపోయింది. కేసులు పెట్టించి తనను ఇబ్బందులకు గురి చేసిందని భార్యపై కోపం పెంచుకున్నాడు. పదో తరగతి వరకు చదువుకున్న లింగం ఫేస్ బుక్ ను ఎలా ఆఫరేట్ చేయాలో తెలుసుకుని భార్య పేరిట నకిలీ ఫ్రొపైల్ సృష్టించాడు. అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలను అందరికీ పంపించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఆ మహిళ తన పేరిట ఎవరో నకిలీ ఖాతాలు సృష్టించి అసభ్యకరంగా ఫోటోలు, వీడియోలు పంపుతున్నారని, ఊర్లో బయటకు రావాలంటేనే ఇబ్బందిగా ఉందంటూ వెళ్లి రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు విషయం తెలుసుకుని ఖంగుతిన్నారు. సాక్షాత్తు భర్తనే ఇలాంటి దారుణానికి పాల్పడటంతో అందరూ నివ్వెర పోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం సాయంత్రం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.