కాంగ్రెస్లో తిరుగులేని నాయకుడుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పిసిసి ఛీఫ్గా వ్యవహరించి కంచర్ల కేశవరావు అలియాస్ కేకే టిఆర్ ఎస్లో చేరి కొన్నాళ్లు బాగానే ఉన్నా ఈ మధ్య రానురాను తీసుకట్టుగా మారిపోతున్నారట. పైగా అధినేత తిట్లపరంపరనీ తట్టుకోలేక మళ్లీ మాతృసంస్ధ కాంగ్రెస్లో చేరిపోవాలని యోచిస్తున్నారని రాజకీయవర్గాలలో వినిపిస్తోంది.
ఆ మధ్య ఆర్టీసీ కార్మికుల సమ్మెను తాను మధ్యవర్తిత్వం చేస్తానంటూ కేకే ముందుకు రావటంతో ఇదంతా కేసీఆర్ వ్యూహంలో భాగమంటూ చాలా మంది నొసళ్లు నొక్కుకున్నారు. కేకే మంచికో, చెడుకో ఈ మాటలు చెప్పినా... ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే నంటూ గులాబి దళంలో కొందరు రెచ్చిపోయారు. అక్కడే అసలు కథ మొదలైంది. అసలే కాంగ్రెస్ నుంచి వచ్చిన నేత కేకే.. కాస్త స్వేచ్ఛ తీసుకుందామనుకున్నాడు. కానీ ఎందుకో బెడసికొట్టింది. పైగా కేకే చొరవ గులాబీబాస్ను మరింత గుస్సాకు గురిచేసిందట. దీంతో ప్రగతి భవన్కు పిలిపించి మరీ చెడామడా కడిగిపారేశారట. ఇది చేయి పార్టీ కాదు.. గులాబీ పార్టీ అంటూ క్లాసు తీసుకున్నంత పనిచేశారంటూ గుసగుసలు వినిపించాయి.
ఓ విధంగా గతంలో పీసీసీ రథసారధి దర్మపురం శ్రీనివాస్ (డీఎస్ ) టిఆర్ ఎస్లో చేరాక, ఎదురైన పరాభవమే ఇప్పుడు కేకే కూడా చవిచూశాడంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. రంగారెడ్డి జిల్లాలోని అటవీ భూముల వ్వవహారం, కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కలవటం ఇలా కేకేని గులాబి పార్టీకి దూరం చేసేలా ఉన్నాయంటున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ వ్యవహారశైలిపట్ల కేకేలోని అసంతృప్తిని సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. వస్తున్న కథనాలన్నీ నిజమే అయితే.. హుజూర్నగర్ ఉప ఎన్నికల అనంతరం.. కేకే తిరిగి హస్తం గూటికి చేరటం ఖాయమన్నమాట.