బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం తెలంగాణపై అధికంగా ఉండవచ్చని వారు అంచనావేశారు. ప్రస్తుతం దక్షిణ తమిళనాడు దానిని ఆనుకొని ఉన్న ఉత్తర శ్రీలంక, కోమోరిన్ ప్రాంతాల నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు నైరుతి బంగాళాఖాతం మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నది. మరో వైపు తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి 2.1 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. వీటి ప్రభావంతో మూడ్రోజులు తెలంగాణలో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతోపాటు ఓ మోస్తరు వానలు కురిసే అవకాశమున్నదని తెలిపారు.