మల్యాల : ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిందనీ, ప్రయాణికులందరికీ తాత్కాలిక కండక్టర్లు టికెట్లు ఇవ్వాలని కలెక్టర్ శరత్ సూచించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు దిగువన ఆర్టీసీ బస్సులను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రయాణికుల నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రయాణ చార్జీలు ఎక్కువ వసూలు చేస్తున్నారా? టికెట్లను అందజేస్తున్నారా? ఆరా తీశారు. ప్రయాణికుల వద్ద టికెట్లను తనిఖీ చేస్తుండగా ఒక్కరికి టికెట్ ఇవ్వలేదని గుర్తించారు. తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్న కండక్టర్ల విధుల్లో సరైన అవగాహన లేక ఒక ప్రయాణికుడు తీసుకోలేదని గుర్తించిన కలెక్టర్ ప్రతి ఒక్క ప్రయాణికుడికీ టికెట్ అందజేయాలని కండక్టర్కు సూచించారు. ప్రయాణ చార్జీల్లో వ్యత్యాసాలు ఉండకుండా బస్సుల్లో చార్జీల వివరాలతో కూడిన బోర్డులను సైతం ఏర్పాటు చేయించామని తెలిపారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ బేతి రాజేశం, ఆర్డీవో డాక్టర్ ఘంటా నరేందర్ తదితరులున్నారు.