ఓ ఆకతాయి ఫోన్ కాల్స్ ఆ దంపతుల కాపురంలో చిచ్చు పెట్టాయి. వేధింపులు భరించలేక ఆమె అతన్ని ఫోన్లోనే నిలదీసింది. దీంతో కక్ష పెంచుకున్న అతను.. ఆమెపై లేనిపోనివి భర్తకు నూరిపోశాడు. అవన్నీ నిజమేననుకుని నమ్మిన భర్త కూడా ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఇదే విషయమై మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరగ్గా.. పురుగుల మందు తాగి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కొమరంభీం జిల్లా జైనూరు మండలం కొండిబగూడలో ఈ దారుణం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. కొండిబగూడకు చెందిన రమాకాంత్కి,శివాజీనగర్కి చెందిన సోన్కాంబ్లీ సీతాల్కి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. గ్రామంలోనే కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెళ్లయిన తర్వాత మూడేళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. అయితే ఓ ఆకతాయి ఫోన్ కాల్స్ వీరి కాపురంలో చిచ్చు రేగింది. అదే గ్రామానికి చెందిన అనికేతన్ అనే ఓ యువకుడు అదే పనిగా తరుచూ ఫోన్ కాల్స్ చేస్తూ వివాహితను వేధిస్తున్నాడు. దీంతో ఓరోజు ఫోన్లోనే
ఆమె అతన్ని చెడామడా వాయించింది. ఆమెపై కక్ష పెంచుకున్న అనికేతన్.. ఆమె భర్తకు లేనిపోనివి చెప్పాడు. అవన్నీ నిజమేనని నమ్మిన భర్త.. నిత్యం ఆమెను వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో ఈ నెల 7న కూడా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్కి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది.