ఈ నెల 18న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలవ్వబోతున్నాయి. వీటికి తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా... ఇవాళ టీఆర్ఎస్, వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాలు జరగనున్నాయి. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం తెలంగాణ భవన్లో జరగనుంది. ఎప్పటిలాగా పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఇది జరగట్లేదు. తొలిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఇది జరగనుండటం విశేషం. ఆయన దిశానిర్దేశంలో పార్టీ ఎంపీలు అడుగులు వెయ్యనున్నారు. లోక్సభ, రాజ్యసభలో ఎలాంటి వ్యూహం అనుసరించాలో మీటింగ్లో డిసైడవుతారు. ప్రధానంగా తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పథకాల కోసం కేంద్రాన్ని పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలిసింది. మొన్నటి హుజూర్నగర్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకపోవడంతో... టీఆర్ఎస్లో కాన్ఫిడెన్స్ పెరిగింది. అదే జోరును పార్లమెంట్లో చూపించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నా్రు.
వైసీపీ కూడా ఇదే అంశంపై తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళే మీటింగ్ పెట్టుకుంటోంది. నిజానికి ఈ మీటింగ్ నిన్నే జరగాల్సి ఉన్నా.... నిన్న ప్రభుత్వం "నాడు-నేడు" కార్యక్రమం నిర్వహించడం వల్ల ఈ మీటింగ్ ఇవాళ్టికి వాయిదా పడింది. ఈ మీటింగ్లో వైసీపీ కూడా కేంద్రం నుంచీ రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా లాంటి అంశాల్లో ఎలా ముందుకెళ్లాలో నిర్ణయించుకోనుంది. ప్రత్యేక హోదా సంగతి ఎలా ఉన్నా... కేంద్రం నుంచీ రావాల్సిన నిధుల విషయంలో మాత్రం గట్టిగా పట్టుపట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.