తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ కు కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో టీఆర్ఎస్ సంచలన విజయాలను నమోదు చేసింది. ఇప్పటికే మధిర, కొత్తగూడెం మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ తాజాగా వెలువడిన ఫలితాల్లో మరిన్ని స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నసంగారెడ్డితో పాటు సదాశివపేట మున్సిపాలిటీలను టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది. రెండు మున్సిపాలిటీల్లోనూ జగ్గారెడ్డికి ఓటర్లు దిమ్మతిరిగే రీతిలో షాక్ ఇచ్చారు. అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ విజయదుందుబి మోగించింది. మొత్తం 14 మున్సిపాలిటీల్లో 13 చోట్ల టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. నారాయన్ఖేడ్ మున్సిపాలిటీని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఫలితాలపై గులాబీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తు, జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.