అధికారులు ప్రజల పట్ల నిజాయితీగా నడుచుకోవాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించాడు. రూపాయి లంచం తీసుకోకుండా వారికి అన్ని విధాలుగా సహకరించాలని ఆయన అన్నారు. ఇవాళ మంత్రి.. మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్లో అదనపు కలెక్టర్లకు నూతన పురపాలకు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఎస్ బీ పాస్పై అధికారులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. మున్సిపల్ చట్టం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. పనిచేయని ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. రూపాయి లంచం లేకుండా, 21 రోజుల్లో ఇండ్లకు పర్మిషన్లు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. అనుమతి ఇవ్వకపోతే అందుకు గల కారణం చెప్పాలన్నారు.పల్లె ప్రగతి విజయవంతమైన నేపథ్యంలో.. ఇక పట్టణప్రగతిపై దృష్టి కేంద్రీకరించాలనీ, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సైతం విజయవంతం చేయాలని మంత్రి అధికారులకు తెలిపారు. ఇవాళ్టి నుంచి నాలుగైదు రోజుల్లో వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలని తెలియజేశారు. వార్డు కమిటీల ఏర్పాటులో రాజకీయాలు చేయొద్దని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సూచించారు. పట్టణ ప్రగతిని విజయవంతం చేస్తే తెలంగాణ పట్టణాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కోసం కొనుగోలు చేసే వాహనాలకు స్టిక్కరింగ్ చేయాలని మంత్రి కేటీఆర్.. అధికారులకు సూచించారు.