తెలంగాణలో మళ్లీ స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 30 కేసులు నమోదయ్యాయి. గాంధీ, ఉస్మానియా, చెస్ట్ ఆస్పత్రుల్లో స్వైన్ ఫ్లూ లక్షణాలతో రోగులు చికిత్స పొందుతున్నారు. అంతేకాక కరోనా వైరస్ అనుమానితుల్లో కొంత మందికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాక, వరంగల్ జిల్లాకు చెందిన ఓ గర్భిణీ స్వైన్ ఫ్లూతో మంగళవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో చేరింది. అయితే, అనుమానిత స్వైన్ ఫ్లూ రోగులకు జనరల్ వార్డులోనే చికిత్స అందిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీంతో గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్వాకం మరోసారి బయట పడింది. స్వైన్ ఫ్లూ రోగికి సాధారణ పేషంట్ల మధ్యలో పడకను కేటాయించడం వివాదాస్పదమవుతోంది. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కనీసం మాస్కులు కూడా అందుబాటులో ఉంచడం లేదని.. అర్థరాత్రి నుంచి వైద్యులు, నర్సులు కూడా అందుబాటులో లేరని చెబుతున్నారు.