తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ డాక్టరు దంపతులకు కరోనా రావడం కలకలంగా మారింది. డాక్టరు దంపతులు దేశంలోనే వివిధ ప్రాంతాల్లో పర్యటించినట్టు గుర్తించామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వారు కలిసిన వారిని గుర్తించే పనిలో ఉన్నామన్నారు. కొంత మందిని గుర్తించి పరీక్షలు కూడా ప్రారంభించామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి తెలంగాణలో కొంత మందికి వైరస్ సోకిందని,దానిని పెరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. రెండో దశ విస్తరించకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. గాంధీ ఆసుపత్రిని పూర్తిగా కరోనా చికిత్సకే వినియోగించేలా తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇప్పటికే గాంధీలో చేయాల్సిన ఆపరేషన్లను ఉస్మానియా ఆస్పత్రిలో చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలో పనిచేసేవారు, ఆశ వర్కర్లు ఎక్కడ పని చేసే వారు అక్కడే ఉండాలన్నారు. వైద్య సిబ్బంది సెలవులు పూర్తిగా రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అవసరం ఉన్న చోట సిబ్బందికి భోజన, రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస రావును మంత్రి ఆదేశించారు. విదేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరి డాటా ఉండాలని చెప్పారు. ప్రజలు కూడా షట్ డౌన్ ని పాటించాలని,పక్క వారిని కలవకుండా ఉండడమే మనల్ని రక్షిస్తుందని మంత్రి సూచించారు.