హాకాభవన్ లో ధాన్యం కొనుగోళ్లు, భవిష్యత్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బి.సి. సంక్షేమం, పౌర సరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సామాజిక దూరం పాటించాలని పరిశుభ్రత విషయంలో, వసతుల కల్పనలో రాజీపడొద్దని అధికారులకు మంత్రి ఆదేశించారు. వరి కోతలను బట్టి దశలవారీగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 713 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో పనిచేసి కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు, కొనుగోలు కేంద్రాల సక్రమ పనితీరుకు చర్యలు తీసుకోవాలి. రైస్ మిల్లుల మిల్లింగ్ సామర్థ్యం, నిల్వ సామర్థ్యం పెరగడం, బియ్యం మిల్లింగ్ పరిశ్రమకు ప్రభుత్వం నుండి అవసరమైన సహాయ సహకారాలు అందించాలి. ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు విషయంలో నిపుణుల సేవలను వినియోగించుకుని బియ్యం మిల్లింగ్ పరిశ్రమ మరియు రాష్ట్రంలో ఆహార ప్రక్రియ పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.