తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేల పై కేసు నమోదైంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇటీవల యాచారంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించడం లేదని ఎంపీపీ సుకన్య ఆరోపించారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తనతో ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారని సుకన్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎమ్మెల్యే పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల పై కూడా కేసు నమోదైంది. మలక్ పేటలో ఓ బాలికను పరామర్శించేందుకు బీజేపీ నేత బంగారు శృతి వెళ్లింది. ఆ సమయంలో ఎమ్మెల్యే బలాల తనను కించపరిచాడని శృతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బలాల పై పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు. ఒకే రోజు ఇద్దరు ఎమ్మెల్యేల పై కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది.