ప్రైవేటు ఆస్పత్రి ఆగడాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఫీజులు బాదుడు ఆగడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వారి మోసాలు ఆగడం లేదు. ఇటీవలే మలక్పేట్లోని తుంబే హాస్పిటల్లో కరోనా బిల్లు ఘటన అందరికీ తెలిసిందే. తాజాగా హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.కరోనాతో చేరిన తనకు ఫీజుల పేరుతో వేధింపులకు గురి చేసినట్లు విజయా కేసరి అనే మహిళా డాక్టర్ సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. వెంటిలేటర్, ఆక్సిజన్ వంటివి పెట్టకపోయినా భారీగా బిల్లు వేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 14 రోజులుగా నరకం చూపించారని, బిల్లు చెల్లించాలంటూ ఆస్పత్రి యాజమాన్యం వేధిస్తోందని అన్నారు. ఆస్పత్రిలో జరుగుతున్న విషయాలపై మంత్రి ఈటలకు కూడా ఫోన్ చేశానని ఆమె తెలిపారు. ఆస్పత్రికి వచ్చిన రోగులను బాగు చేసి పంపాల్సింది పోయి అధిక చార్జీలతో వేధిస్తున్నారని, ఈ సమస్య నుంచి కాపాడాలని ఆమె ప్రభుత్వానికి తెలుపుతూ కన్నీటిపర్యంతమయ్యారు.