తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అపర డేరాబాబాగా మారిన ఓ వ్యక్తి శిష్యుడితో కలిసి ఓ మహిళ పై అత్యాచారానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఆయన లీలలు బయటకు వచ్చాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్కు చెందిన ఓ మహిళ సంతోషిమాత భక్తురాలు. ఆమెకు చాలా రోజులుగా సంతోషి మాతకు ఆలయం నిర్మించాలని సంకల్పం. ఈ క్రమంలోనే చీకోడ్ సమీపంలో రఘు అనే వ్యక్తి సమర్ధ మహారాజ్ పేరుతో స్వామీజీ అవతారమెత్తాడు. ఆయన మహిమ గల బాబాగా ప్రసిద్ధి చెందడంతో ఆ మహిళ ఆయనకు శిష్యురాలిగా మారింది.తాను సంతోషి మాతకు గుడి కట్టించాలని సంకల్పం చేసుకున్నట్లు ఆమె స్వామీజీకి చెప్పింది. భక్తురాలి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న దొంగ బాబా ఆమెపై కన్నేశాడు. రాత్రి వేళల్లో తన శిష్యుడు నరేష్ రూపంలో ఇంటికొస్తే అతడిని శారీరకంగా సుఖపెడితే సంకల్పం త్వరలోనే సిద్ధిస్తుందని చెప్పాడు. ఆమె సరేనని చెప్పడంతో నరేష్ చాలారోజులు ఆమెతో కోరికలు తీర్చుకుంటున్నాడు. ఎన్ని రోజులైనా తన సంకల్పం నెరవేరకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు ఆరా తీయగా స్వామీజీ బండారం బయటపడింది. దీంతో తనను మోసం చేసిన స్వామీజీ, అత్యాచారానికి పాల్పడిన నరేష్పై బాధితురాలు దుబ్బాక పోలీసులను ఫిర్యాదు చేసింది. నరేష్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా సమర్ధ మహరాజ్ స్వామీజీ పరారీలో ఉన్నాడు.