రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారి ఆద్య హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చిన్నారి మరణం,భార్య ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న విషయం తెలిసి ఆవేదనతో ఆద్య తండ్రి కళ్యాణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కళ్యాణ్ 2011లో ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తి ప్రాంతానికి చెందిన అనూషను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కళ్యాణ్ యాదాద్రి భువనగిరి జిల్లాలోనే పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. 3 సంవత్సరాల క్రితం నుంచి వీరు హైదరాబాద్ పోచారం మున్సిపాల్టి పరిధిలోని ఇస్మాయిల్ఖాన్గూడ విహారి హోమ్స్లో నివాసం ఉంటున్నారు. సెల్ ఫోన్ వాయిదాలకు సంబంధించి సికింద్రాబాద్ కు చెందిన కరుణాకర్ తో అనూషకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. కళ్యాణ్ డ్యూటికి వెళ్లగానే అనూష వద్దకు కరుణాకర్ వచ్చేవాడు. కరుణాకర్ తో అతని స్నేహితుడు రాజశేఖర్ కూడా అప్పుడప్పుడు వచ్చేవాడు. అలా రాజశేఖర్ తో కూడా అనూషకు వివాహేతర సంబంధం ఏర్పడింది.జూలై 2న అనూష ఇంటికి కరుణాకర్ వెళ్లిన సమయంలో రాజశేఖర్ ఇంట్లోనే ఉన్నాడు. కరుణాకర్ ను చూసి రాజశేఖర్ ఇంట్లో దాక్కున్నాడు. బయటికి రాకపోతే అనూష కూతురు ఆద్యను చంపేస్తానని కరుణాకర్ బెదిరించాడు. అయినా రాకపోవడంతో ఆవేశంతో ఆద్యను కిరాతకంగా కరుణాకర్ హత్య చేశాడు. అప్పటి నుంచి కళ్యాణ్ దిగాలుగా ఉంటున్నాడు. ఓ వైపు భార్య చేసిన పనితో అవమానం,మరో వైపు గారాబంగా చూసుకున్న కూతురు మరణించడంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. శనివారం ఉదయం భువనగిరిలోని రైల్వే స్టేషన్ కు సమీపంలో పట్టాల పై పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటనతో అక్కడ విషాదచాయలు అలుముకున్నాయి.