లాక్డౌన్ తర్వాత పునఃప్రారంభమైన దేశీయ విమాన సర్వీసుల రాకపోకలు రెండు నెలల్లో మూడు రెట్లు పెరిగాయి. ఆగస్టు 1న 150 విమాన సర్వీసులు నడవగా.. 14వేల మంది రాకపోకలు సాగించారు. దేశవ్యాప్తంగా కొవిడ్-19 వైరస్ వ్యాప్తి కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు డీజీసీఏ అధికారులు మార్చి 25న దేశీయ విమాన సర్వీసుల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. రెండు నెలల తర్వాత మే 25న రాకపోకలు పునరుద్ధరించారు. మొదటి రోజు కేవలం 19 సర్వీసుల్లో నాలుగున్నర వేల మంది ప్రయాణించారు. అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకలపై డీజీసీఏ విధించిన నిషేధం ఈనెల 31 వరకు కొనసాగనుంది. విదేశాల్లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని ‘వందే భారత్ మిషన్’ కార్యక్రమంలో భాగంగా రోజుకి ఐదు విమానాల్లో తీసుకొస్తున్నట్లు అధికారులు వివరించారు.