ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారే తప్ప ప్రజలు చదువుకొని అభివృద్ధి చెందే విషయంలో శ్రద్ధ చూపడం లేదని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 40 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలంటూ డిమాండ్ చేస్తూ... తెలంగాణా నిరుద్యోగ జేఏసీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నాకు ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి... ఆరేళ్ళు గడుస్తున్నా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని, ఉద్యోగాల భర్తీ కోసం ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన అన్నారు. లేనిపక్షంలో ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం టీచర్ పోస్టులు భర్తీ చేసి, టెట్ నిర్వహించాలని... లేనిపక్షంలో ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో నిరుద్యోగులతో కలిసి నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి 119 నియోజకవర్గాలలో పోటీ చేస్తామని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ తెలిపారు.