నగరంలో నూతనంగా నిర్మిస్తున్న భవనాల వద్ద డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై టాడా చట్టం నమోదు చేసి జైల్లో పెడతామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. గోశామహల్ నియోజకవర్గంలో కొంత మంది నాయకులు ఈ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని... సొంత పార్టీ నాయకులైనా వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే స్థానిక పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేయాలని భవన నిర్మాణదారులకు సూచించారు. ఈ మేరకు దేవాదాయ భూముల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై మసబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో కార్పొరేటర్లు, దేవాదాయ శాఖ, పోలీస్ శాఖ, జిహెచ్ఎంసి అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. దేవాలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా, పురాతన దేవాలయాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను మంత్రి చర్చించారు. గోశామహల్ నియోజకవర్గంలో పురాతన దేవాలయాల అభివృద్ధికి రినోవేషన్ కమిటీని వేసి అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నందు బిలాల్, కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ తదితరులు పాల్గొన్నారు