టీఆర్ఎస్ మన పిల్లల భవిష్యత్తు, కొలువల కోసం పాటుపడుతుంటే.. బీజేపీ నేతలు హిందూ, ముస్లీం పంచాయతీపెట్టి కర్ఫ్యూ తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పిల్లల భవిష్యత్తు కావాలో.. బీజేపీ అల్లర్లు కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. గత ఆరేండ్లుగా నగరవాసులు అన్నదమ్ములుగా ఉన్నారని.. ఏ పంచాయతీ లేకుండా ఉన్నామని కేటీఆర్ గుర్తు చేశారు. మరి ఇటువంటి హైదరాబాద్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనిని ప్రజలు గమనించుకోవాలని కేటీఆర్ చెప్పారు. వరదలతో నగరవాసులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం ఆర్థిక సాయం ఇస్తుంటే కూడా ఆపేశారని ఆరోపించారు. ఉత్తరాలు రాసి మరి రూ. 10 వేల సాయాన్ని అడ్డుకున్నారన్నారు. కానీ, ఎన్నికల తర్వాత తప్పకుండా సాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిపిస్తే బీజేపీ రూ. 25 వేలు ఇస్తామని చెప్పుతున్నారని.. రూ. 10 వేలు ఆపిన బీజేపీ డబ్బులు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. అమ్మకు అన్నం పెట్టనొళ్లు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తరా అంటూ కేటీఆర్ చురకలు వేశారు.