తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చందమామ లాంటి పిల్లలు చనిపోతుంటే కేసీఆర్కి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్కు ఉన్నది గుండెనా.. బండరాయా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యువతకు న్యాయం జరగాలని, నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకు తమ దీక్షలు కొనసాగుతాయన్నారు. ఇవాళ తను ప్రారంభించిన దీక్ష.. 72 గంటల పాటు కొనసాగుతుందని సంచలన ప్రకటన చేశారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ దగ్గర ప్రారంభించిన దీక్షకు పోలీసులు ఒక రోజు మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే షర్మిల తాజా ప్రకటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనిపై పోలీసుల నుంచి ప్రకటన రావలసి ఉంది.
అంతకు ముందు షర్మిల మాట్లాడుతూ... ఉద్యోగాలు లేక యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా.. కేసీఆర్లో చలనం రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం ఖాళీగా ఉందని, అసలు ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయట్లేదో కేసీఆర్ చెప్పాలన్నారు. యువతకు అండగా తాము పోరాటం చేస్తామన్నారు. షర్మిల దీక్షకు మద్దతుగా ఆమె అభిమానులు జిల్లాల్లో దీక్షలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, షర్మిల దీక్షకు బీసీ సంఘాల జాతీయ నేత ఆర్ కృష్ణయ్య, రచయిత కంచె ఐలయ్య తమ మద్దతు ప్రకటించారు.