మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఒక మేక వన్నె పులి అని, బీసీ ముసుగు కప్పుకున్న పెద్ద దొర అని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ నుంచి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈటలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల హుజురాబాద్కు వెళితే బీసీ, హైదరాబాద్కు వస్తే ఓసీ అని, ఆయన సీఎం మీద మాట్లాడే స్థాయికి వచ్చారని అన్నారు. దేవరాయాంజల్ భూముల కోసం అప్పటి సీఎం వైఎస్తో మాట్లాడిన ఈటల, ముదిరాజ్ల కోసం ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తన వ్యాపార భాగస్వాములు ఎవరైనా బీసీలు ఉన్నారా.. ఇప్పుడు బీసీలు తమకు గుర్తుకు వచ్చారా అని నిలదీశారు. చీమలు పెట్టిన పుట్టలో పాములా మీరు చేరారని గంగుల విమర్శించారు. సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాము ఊరుకోమని హెచ్చరించారు. బీసీలను ఎదగకుండా చేశారని, టీఆర్ఎస్ బీఫామ్ తమకు పవిత్ర గ్రంధమని అన్నారు. బీ ఫామ్ మీద పోటీ చేసిన వారిని ఓడించే ప్రయత్నం చేశారని గంగుల అన్నారు. ఈటల ఎప్పటి నుంచో ప్రతిపక్ష పార్టీల నాయకులతో టచ్లో ఉన్నారని, అందుకే వారు మద్దతు ఇస్తున్నారని అన్నారు. హుజూరాబాద్లో కేసీఆర్ బొమ్మతో ఈటల గెలిచాడని, ఆరుసార్లు గెలవడం తన గెలుపు కాదని కేసీఆర్దని అన్నారు. కేసీఆర్ బొమ్మ వల్లనే జానారెడ్డి లాంటి నాయకులు ఓడిపోయారన్నారు.