పెళ్లి కొడుకు నచ్చలేదంటూ వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే పెళ్లి కుమారుడు కుటుంబ సభ్యులు పెళ్లి కూతురికి ఇచ్చిన 2 లక్షల బంగారు ఆభరణాలతో పాటు, 50 వేల రూపాయలతో పెళ్లి కూతురు ప్రియుడితో పరారైన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం చెలరేగింది. స్థానికుల వివరాల ప్రకారం బెంగళూరుకు చెందిన వ్యాపారి మహమ్మద్ ఇలియాస్ కు పాతబస్తీ వట్టేపల్లి ప్రాంతానికి చెందిన యువతితో సెప్టెంబర్ 16వ తేదీన వివాహం నిశ్చయమయింది. పెళ్లి కుమారుడు, కుటుంబసభ్యులు అదే రోజు బెంగళూరు నుంచి రావడం. అలసిపోవడం కారణంగా ఆ రోజు జరగాల్సిన పెళ్లిని రద్దు చేసుకుని మరునాడు 17వ తేదీ సాయంత్రం ఇరు కుటుంబాల సమక్షంలో బాలాపూర్ మండల పరిధిలోని రాయల్ కాలనీలో వారిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత ఇరు కుటుంబాలు సంతోషంగా భోజనం చేయవలసిన సమయం కానీ పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే ఇరు కుటుంబాలకు పెళ్లి కూతురు ట్విస్ట్ ఇచ్చింది. రాత్రి మరోసారి అందంగా తయారయ్యేందుకు బ్యూటీ పార్లర్కు వెళ్లి ముస్తాబయి వస్తానని చెప్పి, వెళ్లిన వధువు వెనక్కి తిరిగి రాలేదు. గంట అవుతున్నా. పెళ్లి సందడి లో కుటుంబ సభ్యులు ఆనందాలు ఒక్కసారిగా ఆవిరైపోయాయి. సభ్యులు ఆందోళన చెందుతూ అటు ఇటు పరిసర ప్రాంతాల్లో ఆమె కోసం వెదకడం ప్రారంభించారు. ఇంతలో పెళ్లి కూతురి నుంచి ఫోన్ వచ్చింది. “నాకు ఆ పెళ్లి కొడుకు నచ్చలేదు. తాను గతంలోనే ప్రేమించిన ప్రియుడితో వెళ్లి పోతున్నా” అంటూ అక్కడున్నవారందరికి ఝలక్ ఇచ్చింది.దీంతో ఇరు కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. అనంతరం వారి కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరికొకరు నిందించు కున్నారు. దూషణలు చేసుకున్నారు. చివరకు కుటుంబ పెద్దలు రంగంలోకి దిగి వారిని వారించారు. వారి మధ్యలో సహజ శాంతియుత వాతావరణం నెలకొల్పారు.