టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీని ‘ఛీ’ఆర్ఎస్ గా అభివర్ణించారు. అయితే బీజేపీకి తెలంగాణ సీఎం కేసీఆర్ చీకటి మిత్రుడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అమిత్ షా పర్యటన, సభపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ''తుక్కుగూడలో అమిత్ షా ప్రసంగం కొండంత రాగం తీసి… అన్నట్టుగా ఉంది. తెలంగాణ ప్రజల తరపున మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు.
కేసీఆర్ కుటుంబ అవినీతి పై ఆర్భాటపు ప్రకటనలే తప్ప ఆచరణతో కూడిన చర్యలు ఉండవని తేలిపోయింది. అంతేలే షా జీ… మీ చీకటి మిత్రుడి పై ఈగవాలనివ్వరుగా!!'' అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు సభకు ముందు అమిత్ షాకు 9 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను సంధించారు. వాటిపై సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డాడడని అనడమే తప్పా, ఈడీ, సీబీఐలతో ఎందుకు దర్యాప్తు జరిపించడం లేదని నిలదీశారు.
టీఆర్ఎస్ పార్టీని ‘ఛీ’ఆర్ఎస్గా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కుమ్మక్కై, తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. తెలంగాణ ఆత్మగౌరవంపై పార్లమెంట్ వేదికగా ప్రధాని మోడీ మాటల దాడి చేశారన్నారు. దానిపై అమిత్ షా ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రైతులకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని అన్నారు. వీటన్నింటిపైనా ప్రజలకు అమిత్ షా చెప్పాలని సవాల్ విసిరారు.