ఆడ బిడ్డ పుట్టిందనే సంతోషం ఆ కుటుంబంలో లేదు. ఓ వైపు మానసిక స్థితి సరిగా లేని భార్య, పుట్టి వారం కూడా గడవని ఆ పసికందును చూసి అంతా చలించిపోయారు. ఆడబిడ్డను తండ్రికి అప్పగించారు. ఆ చిన్నారిని తాను పెంచలేనని పోలీసులను తండ్రి ఆశ్రయించాడు. ఈ విషయంలో పోలీసులకు ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొంది. గుక్కపెట్టి ఏడుస్తున్న ఆడ శిశువును చివరికి తల్లి చెంతకే పోలీసులు చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రెంజల్ ప్రాంతానికి చెందిన రేణుక అనే మహిళకు నగేష్ అనే వ్యక్తితో గత సంవత్సరం పెద్దలు వివాహం జరిపించారు. మే 7న పండంటి ఆడబిడ్డకు రేణుక జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. ఇటీవల ఆమె ఇంటికి ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు వెళ్లి పరిశీలించారు. బిడ్డకు సరిగ్గా పాలు కూడా పట్టించలేని పరిస్థితిలో రేణుక ఉందని గ్రహించారు. విషయాన్ని వెంటనే ఆమె భర్త నగేష్కు చెప్పారు. ఆయన వచ్చి తన కుమార్తెను ఇంటికి తీసుకెళ్లాడు. అసలే పసి బిడ్డ కావడం, శిశువును పెంచే స్తోమత లేకపోవడంతో నగేష్ ఆవేదన చెందాడు. చివరికి ఏడురోజుల పసికందును తీసుకెళ్లి, పోలీస్ స్టేషన్లో శనివారం అప్పగించాడు. తాను పోషించలేనని చెప్పాడు. మరో వైపు శిశువు తల్లి రేణుక తరుపు వారు కూడా ఆ బిడ్డను సాకలేమని చెప్పారు. అటు తల్లి, ఇటు తండ్రి వైపుల వారు బిడ్డను వద్దనుకున్నారు. ఈ విషయాన్ని ఐసీడీఎస్ సిబ్బందికి పోలీసులు చేరవేశారు. ప్రస్తుతానికి ఆ పసికందును తల్లి వద్దే ఉంచారు.