తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంటున్నదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. పరకాల మున్సిపాలిటీ, పరకాల, నడికుడ, ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన 116 మంది కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ. 1 కోటి 16 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నిరుపేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి పథకం వరంగా మారిందన్నారు. పేదల కళ్లలో ఆనందం చూసేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో గ్రామీణ ప్రాంతాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామపంచాయతీలకు ప్రతినెలా రూరల్ డెవలప్ మెంట్ కార్యక్రమం ద్వారా నిధులు మంజూరు చేస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.