అబద్ధాలు అతికినట్లు చెప్పినా..అవి నిజాలు అయిపోవు అంటూ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆదివారం విడుదల చేసిన ఆరోగ్యశాఖ వార్షిక హెల్త్ రిపోర్టుపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. "ఆపరేషన్ సక్సెస్.. పేషంట్ డైడ్" అన్నట్లుంది అరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విడుదల చేసిన హెల్త్ రిపోర్ట్. అబద్ధాలు అతికినట్లు చెప్పినా..అవి నిజాలు అయిపోవు మంత్రి గారు! పరికరాలు సమకూర్చినం, భవనాలు కట్టినం అని గొప్పలు చెప్తే సరిపోతుందా? పిహెచ్సీ నుంచి జిల్లా ఆసుపత్రి వరకు వస్తున్న రోగుల సంఖ్య ఎంత..? వారికి వైద్యం అందిస్తున్న సిబ్బంది ఎంత..? వైద్యం అందక రోగుల ఆర్తనాదాలు మీకు వినిపించవు. సర్కారీ దవాఖానలో వైద్యం అందక చచ్చే చావులు కనిపించవు' అని షర్మిల మండిపడ్డారు.
'మెటర్నిటీ మరణాలను ఆపలేని మీ ప్రభుత్వం.. మెరుగైన వైద్యంలో తెలంగాణ నంబర్ 1 అని చెప్పడం సిగ్గు అనిపించడం లేదా? ఆసుపత్రుల్లో నర్సులు ఉంటే డాక్టర్ ఉండడు. డాక్టర్ ఉంటే ఇతర సిబ్బంది ఉండరు. X-ray, సిటీ స్కాన్, టిఫా స్కాన్ లాంటి యంత్రాలకు టెక్నీషియన్లు లేక ఎన్నో ఆసుపత్రుల్లో మూలకు పడ్డాయి. జిల్లా ఆసుపత్రిలో 300 మంది సిబ్బంది ఉండాల్సిన చోట 30 మందితో వైద్యం అందించడం అభివృద్ధి అంటరా..?' అని వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
'మహానేత హయాంలో అద్భుతంగా అమలైన అరోగ్యశ్రీ పథకాన్ని డెత్ బెడ్ ఎక్కించారు. 800 కోట్లు బకాయిలు పెట్టారు. మీరు బిల్లులు ఇయ్యరని కార్పొరేట్ దవాఖానాలు కేసులు తీసుకోవడమే మానేశాయి. 108ను కోమాలో పెట్టారు. 104ను మాయం చేశారు. మొత్తంగా మీరు చెప్పిన అరోగ్య ప్రగతి మసిపూసి మారేడుకాయ చేసినట్లు గానే ఉంది' అని షర్మిల ధ్వజమెత్తారు.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా హరీష్ రావు ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏడాదిలో జరిగిన అభివృద్ధిపై ఆరోగ్యశాఖ ప్రగతి నివేదికను విడుదల చేశారు. దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న మూడో రాష్ట్రంగా తెలంగాణను నీతి అయోగ్ గుర్తించిందని తెలిపారు. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ను 43 శాతానికి తగ్గించి ఎంఎంఆర్ రేట్ అతి తక్కువ ఉన్న మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 2014 నాటికి 39గా ఉన్న ఇన్ఫాంటర్ మోర్టాలిటీ రేట్ను 21కి తెలంగాణ వైద్యారోగ్యశాఖ తగ్గించింది. త్వరలో మరో 9 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నామని, హైదరాబాద్ నలుమూలల నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.వరంగల్లో మరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మిస్తామని హరీష్ రావు తెలిపారు. నిమ్సలో బడ్ల సంఖ్యను 1489 నుంచి 3489కి పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.