జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం వచ్చే బడ్జెట్లో కేంద్రం లక్ష కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం ప్రధాని మోదీకి లేఖ పంపినట్లు మిర్యాలగూడలో తెలిపి మాట్లాడారు. బీసీ వర్గానికి చెందిన మోదీ ప్రధాని పదవిలో ఉన్నప్పటికీ బీసీలకు రాజ్యాంగ ఫలాలు అందడం లేదన్నారు. 52 శాతానికి పైగా ఉన్న బీసీలకు నిధుల కేటాయింపుల్లో ఏటా అన్యాయం జరుగుతూనే ఉందని, గత బడ్జెట్లో కేవలం 2 వేల కోట్లు కేటాయించడమే ఇందుకు నిదర్శనం అన్నారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకు బడ్జెట్ కేటాయింపులు చేయాలని కోరారు. కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు, జయమ్మ, నాగేశ్వరరావు, దుర్గయ్య, కవిత, జయరాజ్, మురళి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.