భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను రేవంత్ రెడ్డి సర్కార్ అవమానించిందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తీవ్ర ఆరోపణలు చేశారు. సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన 125 అడుగుల ఆకాశమంతా అంబేద్కర్ విగ్రహం వద్ద కనీస అలంకరణలు కూడా చేయలేదని.. ఆయనకు ఓ పూలమాల కూడా వేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద కనీసం పరిసరాలను కూడా శుభ్రం చేయించలేదని అసహనం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్కు ఇంత అహంకారం ఎందుకని బాల్క సుమన్ ప్రశ్నించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ పెట్టారన్న కారణంతోనే.. అక్కడ ఏర్పాట్లు చేయలేదా..? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని సుమన్ డిమాండ్ చేశారు.
కేసీఆర్ పెట్టిన అంబేద్కరునికి పూల మాల కూడా వేయకుండా అవమానించిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కట్టి, అంబేద్కర్ పేరు పెట్టిన సచివాలయంలో మాత్రం ఎలా కూర్చుంటున్నారంటూ బాల్క సుమన్ ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ గుర్తులను చెరిపేస్తామని పదే పదే చెప్తున్న రేవంత్ రెడ్డి.. ఇప్పటికే ఆ దిశగా పనులు మొదలుపెట్టిందని ఆరోపించారు. అందులో భాగంగానే.. కాళేశ్వరం నీళ్లు రైతులకు అందకుండా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందని తెలిపారు. ఇప్పుడు ఆయన ఏర్పాటు చేసిన ఆకాశమంత అంబేద్కరుని దగ్గర కనీస అలంకరణలు చేయకుండా తమ అహంకారాన్ని నిరూపించుకున్నారని ఆరోపించారు.
దళిత సమాజానికి సీఎం రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. సీఎం ఫ్యూడల్ మైండ్సెట్తో ఉన్నారని.. ఇదంతా చూస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎందుకు సైలెంట్గా ఉన్నారని ప్రశ్నించారు. యాదాద్రిలో చిన్నపీట వేసినా మౌనంగా ఉన్నారని.. ఇప్పుడు అంబేద్కర్నే అవమానించినా సైలెంట్గా ఉన్నారని ఆరోపించిన సుమన్.. ఆయన కల్పించిన రిజర్వేషన్లతోనే డిప్యూటీ సీఎంగా భట్టి ఎంపికయ్యారని గుర్తు చేశారు.
దళితుల ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి కించపరిచారని బాల్క సుమన్ ఆరోపించారు. ఈ ఘటనపై రాష్ట్రంలో దళిత సంఘాలు, మేధావులు స్పందించాలన్నారు. గతంలో అనేక విషయాలపై స్పందించిన లౌకికవాదులు, మేధావులు నోరు విప్పాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకుందని.. కానీ ఇప్పుడు వచ్చిన రేవంత్ మాత్రం నయా దేశ్ముఖ్లా వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.