ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2024, 09:42 PM

 హైదరాబాద్ నుంచి వివిద ప్రాంతాలకు ప్రయాణించే వారికి గుడ్ న్యూస్. హైదరాబాద్ నుంచి కొత్తగా మరో 7 విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ ప్రకటించింది. హైదరాబాద్‌తో పాటు విశాఖ నుంచి కూడా కొత్తగా విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్టు ఇండిగో సంస్థ ప్రకటించింది. ఈ మేరకు.. రెండు నగరాల నుంచి మొత్తం 11 కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్టు సంస్థ అధికారికంగా వెల్లడించింది. హైదరాబాద్ నుంచి ఏడు నగరాలకు ప్రారంభించే కొత్త విమాన సర్వీసులను ఈ నెలలోనే (సెప్టెంబర్‌) మొదలు పెట్టనున్నట్టు సంస్థ ప్రకటించింది. దీంతో.. హైదరాబాద్‌కు దేశీయ విమాన కనెక్టివిటీ మెరుగుపడనుందని సంస్థ అభిప్రాయపడింది.


హైదరాబాద్‌లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి.. ప్రారంభించనున్న కొత్త సర్వీసులు అయోధ్యతో పాటు రాజ్‌కోట్, అగర్తలా, జమ్ము, ఆగ్రా, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్‌ నగరాలకు నడపనున్నారు. కాగా.. ఇందులో సెప్టెంబర్ 29న అయోధ్యకు కొత్త సర్వీస్‌ను ప్రారంభించనున్నట్టు సంస్థ తెలిపింది. ఈ సర్వీస్.. సోమవారంతో పాటు.. మంగళ, శుక్ర, ఆదివారాల్లో.. మొత్తంగా వారానికి నాలుగు సార్లు నడపనున్నట్టు పేర్కొంది.


ఇక.. హైదరాబాద్ నుంచి యూపీలోని 3 ప్రధాన నగరాలకు ఇండిగో కొత్త సర్వీసులు నడపనుంది. వారంలో బుధ, గురు, శనివారాలు (మూడు రోజులు) ఆగ్రా, ప్రయోగ్ రాజ్‌లకు డైరెక్ట్ సర్వీసులు నడపనున్నట్టు ఇండిగో ప్రకటించింది. ఈ మూడు సర్వీసులను సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభించున్నారు. మరోవైపు.. కాన్పూర్ సర్వీస్‌ను సెప్టెంబర్ 27న ప్రారంభించనున్నారు. ఈ సర్వీస్ సోమ, బుధ, శుక్ర, శనివారాలు (4 రోజులు) నడపనున్నట్టు అధికారులు ప్రకటించారు.


ఇక.. హైదరాబాద్ నుంచి రాజ్ కోట్‌కు సెప్టెంబర్ 16 నుంచి, అగర్తలాకు సెప్టెంబర్ 23 నుంచి కొత్త సర్వీసులు ప్రారంభించనున్నారు. ఈ సర్వీసులు సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో (వారానికి నాలుగు రోజులు) నడుపనున్నారు. మరోవైపు.. సెప్టెంబర్ 24 నుంచి హైదరాబాద్ నుంచి జమ్మూకు నూతన సర్వీసును ప్రారంభించనున్నారు. ఈ సర్వీస్ మంగళ, గురు, శనివారాలు (వారానికి 3 రోజులు) నడపనున్నట్టు ఇండిగో ఎయిర్ లైన్స్‌ సంస్థ వెల్లడించింది.


ఇదిలా ఉంటే.. విశాఖపట్నం నుంచి కొత్తగా 4 విమాన సర్వీసులను నడుపుతున్నట్లు సంస్థ తెలిపింది. సెప్టెంబర్ నెలలో ఒక సర్వీస్, అక్టోబర్ నెలలో మరో 3 సర్వీసులు ప్రారంభించనున్నట్టు పేర్కొంది. సెప్టెంబర్ 21వ తేదీన ఉదయం 9 గంటలకు విశాఖ నుంచి హైదరాబాద్‌‌కు కొత్త సర్వీసు ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఇక.. అక్టోబర్‌ 27న విశాఖ నుంచి విజయవాడకు కొత్త సర్వీస్ ప్రారంభించనున్నారు. మరోవైపు.. విశాఖ నుంచి అహ్మదాబాద్‌‌కు వెళ్లే కొత్త సర్వీసును కూడా అక్టోబర్‌లోనే ప్రారంభించనున్నారు. ఈ కొత్త సర్వీసులు విశాఖ నుంచి ప్రతిరోజూ ఉదయం 9.15 గంటలకు బయలుదేరనున్నట్టు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com