మన జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో అందించే పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసే దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఖరీఫ్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పూర్వ ప్రాథమిక విద్య పై అజీమ్ ప్రేమ్ జీ సంస్థ ప్రతినిధులు, రాష్ట్రస్థాయి బృంద సభ్యులు, సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.పూర్వ ప్రాథమిక విద్యను అంగన్వాడీ కేంద్రాలలో బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను అజీమ్ ప్రేమ్ జీ సంస్థ సభ్యులు శ్రీనివాసరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,జూన్ మాసం నుంచి అక్టోబర్ వరకు సంగారెడ్డి జిల్లాలో అజీమ్ ప్రేమ్ జీ సంస్థ సహకారంతో అంగన్వాడి కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్య పకడ్బందీగా అమలు చేయడం జరిగిందని, ప్రస్తుతం అదే స్థాయిలో మన జిల్లాలో అమలు చేసేందుకు అజీమ్ ప్రేమ్ జీ సంస్థ సహకారం అందించడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
పెద్దపల్లి జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో 3 నుంచి 6 వయసు గల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య సిలబస్ బోధించేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన బోధన పద్ధతులు, తదితర అంశాల పై అజీమ్ ప్రేమ్ జీ సంస్థ ఆధ్వర్యంలో 28 సూపర్ వైజర్లకు, 28 యాక్టివ్ టీచర్లకు వచ్చే నెల ప్రత్యేక శిక్షణ అందించడం జరుగుతుందని అన్నారు.ఈ శిక్షణ వినియోగించుకొని సూపర్వైజర్లు, యాక్టివ్ టీచర్లు ప్రతినెల నిర్వహించే సమావేశాలలో బోధన పద్ధతులు, పూర్వ ప్రాథమిక విద్య అమలుకు చర్యల పై ఇతర అంగన్ వాడి టీచర్లకు అవగాహన కల్పిస్తారని అన్నారు. మన అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల హాజరు శాతం పెంచుతూ వారికి మంచి పూర్వ ప్రాథమిక విద్య అందే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతినిధులు రాహుల్, అజీమ్ ప్రేమ్ జీ సంస్థ సభ్యులు శ్రీనివాసరావు, జిల్లా సంక్షేమ అధికారి వేణు గోపాల్ రావు ,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.