ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూసీ నిర్వాసితులకు రూ.కోటి విలువైన ఇంటి స్థలం.. గజం రూ.50 వేలకు పైగానే, సర్కార్ కీలక నిర్ణయం.

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 07:50 PM

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ప్రవహించే మూసీ నదికి పునరుజ్జీవనం తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది. మూసీ ప్రక్షాళనలో భాగంగా నదీ పరివాహకప్రాంతాల్లోని అక్రమణలను తొలగిస్తోంది. రివర్ బెడ్ ప్రాంతంలోని ఇండ్లను కూల్చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇక బాధితులుగా మారుతున్న మూసీ నిర్వాసితులకు న్యాయం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వారిని సరైన పరిహారం ఇప్పించి.. ఒప్పించాకే ఖాళీ చేయించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా.. ఒక్కొక్కరికి 150-200 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.


మూసీ రివర్ బెడ్ ప్రాంతంలో ఉంటున్న వారితో పాటుగా.. 50 మీటర్ల బఫర్‌ జోన్‌లోని వారి ఇండ్లు, దుకాణాలు కూల్చేయాల్సి ఉంది. మూసీ రివర్ బెడ్‌లో ఉన్న 1600 మందిలో దాదాపు 1200 మంది ఇండ్లను ఖాళీ చేసి ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లలోకి వెళ్లడానికి తమ అంగీకారం తెలిపారు. రూ.25వేల చొప్పున నగదు, ఉపాధి కోసం రూ.2 లక్షల లోన్లను ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటికే 250 ఇండ్లను ఖాళీ చేసి మంది వెళ్లిపోయారు. అయితే బఫర్‌ జోన్‌లో ఉన్నవారు మాత్రం తమకు పూర్తిస్థాయి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం చాలాదని ఖాళీ చేయడానికి ఒప్పుకోవటం లేదు.


దీంతో ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. మంత్రి పొంగులేటి రంగంలోకి దిగి సీఎంతో చర్చలు జరిపారట. బఫర్‌ జోన్‌లోని నిర్వాసితులకు హైదరాబాద్ సమీపంలో ఇండ్ల స్థలాలను ఇస్తే బాగుంటుందని చెప్పారట. అందుకు సీఎం రేవంత్‌ రెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మూసీ నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు కూడా ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సియోల్ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి వెల్లడించారు. వారికి కేటాయించే ఇండ్ల స్థలాల కోసం 650- 800 ఎకరాలు అవసరమని ఇప్పటికే అధికారులు గుర్తించారు.


ఇప్పుడు ఆ స్థలాలు ఎక్కడున్నాయనే దానిపై అధికారులు కసరత్తు మెుదలుపెట్టారు. ఔటర్ రింగు రోడ్డు సమీపంలో భారీగా ప్రభుత్వ భూములున్నాయి. ఎక్కడ ఎన్ని ఎకరాలు ఉందో ఆ లెక్కలు తీసుకుంటున్నారు. రెండు, మూడుచోట్ల భూములను సేకరించి లేఅవుట్లు వేసి అందులో సకల సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అక్కడ గజం 50 వేలకు పైబడి ధర పలికే అవకాశం ఉండగా.. ఒక్కో లబ్ధిదారుడికి 150 నుంచి 200 గజాల స్థలం ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు బఫర్‌ జోన్‌లోని నిర్వాసితులు అంగీకరిస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com