ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'నాన్న అమ్మేస్తానన్నాడు.. ఇంటికి వెళ్లను'.. స్కూళ్లో దాక్కున్న ఆరో తరగతి బాలిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 07:51 PM

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో గుండెల్ని పిండేసే ఘటన చోటు చేసుకుంది. ఓ 11 ఏళ్ల బాలిక తాను ఇంటికి వెళ్లనని స్కూళ్లోనే దాక్కుంది. ఇంటికి వెళితే తన తండ్రి కొడుతున్నాడని.. ఎవరికైనా అమేస్తానంటున్నాడని.. భయంగా ఉందని.. స్కూళ్లనే ఉంటానని చెప్పింది. దీంతో తోటి విద్యార్థులు, టీచర్లు కంటతడి పెట్టుకున్నారు. అయితే స్కూలుకు చేరుకున్న తండ్రి తన కూతుర్ని ఇంటికి పంపాలంటూ గొడవకు దిగాడు. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు.


వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ నగరంలోని బాబానగర్‌కు చెందిన అక్బర్‌ దంపతులు గత కొన్ని నెలల క్రితం ఉపాధి నిమిత్తం చౌటుప్పల్‌ ప్రాంతానికి వచ్చారు. అక్కడే నివాసముంటుూ చిన్నాచితక పనులు చేస్తున్నారు. వారి కుమార్తె (11)ను చౌటుప్పల్‌ బంగారుగడ్డలోని అప్పర్ ప్రైమరీ స్కూళ్లో ఆరో తరగతి చదువుతోంది. అయితే గత కొన్ని రోజుల క్రితం బాలిక తల్లి.. తన మూడేళ్ల కుమారుడిని తీసుకుని ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. అప్పట్నుంచి ఒంటరిగా ఉంటున్న తండ్రి అక్బర్ భార్యపై కోపాన్ని కుమార్తెపై చూపుతూ చిన్నారిని తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈనెల 23న రాత్రి కుమార్తెను అక్బర్ కొట్టాడు. దీంతో మరుసటి రోజు గురువారం ఉదయం బాలిక స్కూల్‌కి రాలేదు.


మధ్యాహ్నం భయం భయంగా స్కూల్‌కి వచ్చిన బాలిక ఆకలిగా ఉందంటూ తన తోటి స్నేహితురాళ్ల వద్ద వాపోయింది. ఆ తర్వాత తన తండ్రి కొట్టాడని.. ఎవరికైనా అమ్మేస్తానని అంటున్నాడని తన బాధను వారితో చెప్పింది. దీంతో తోటి విద్యార్థులు విషయాన్ని స్కూల్ టీచర్లకు చెప్పారు. టీచర్లు బాలికకు భోజనం పెట్టించి ఓదార్చారు. ఇదే సమయంలో మద్యం మత్తులో అక్కడికి వచ్చిన తండ్రి అక్బర్‌ను చూసిన బాలిక భయంతో వణికిపోతూ అక్కణ్నుంచి పరుగుపెట్టింది. బడి వెనక భాగంలో ఉన్న భవిత కేంద్రంలో బిక్కు బిక్కుమంటూ దాక్కుంది.


కుమార్తె కనిపించకపోవటంతో అతను స్కూల్ టీచర్లతో గొడవ పెట్టుకున్నాడు. వారిపై దాడికి ప్రయత్నించాడు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత స్కూల్ టీచర్లు బాలికను ఎంఈవో ఇచ్చిన సమాచారంతో పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. జిల్లా బాలల సంరక్షణ కేంద్రం అధికారికి సమాచారం ఇవ్వగా.. వారు బాలికను జిల్లా బాలసదన్‌కు తరలించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com