ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 10:34 PM

గ్రూప్-1 పరీక్షలను అభ్యర్థులు, అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. గ్రూప్-1 ఉద్యోగాల కోసం కొన్నేళ్లుగా సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఉన్నారు. ఏళ్లుగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా పరీక్షలో వచ్చి కొన్ని ప్రశ్నలకు తికమకపడి ఏం రాయాలో తెలియక గందరగోళానికి గురవుతుంటారు. అంత క్లిష్టతరమైన పరీక్షలను ఓ అభ్యర్థి కాపీ కొట్టి పాసవ్వాలనుకున్నారు. పైగా ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కావడం మరింత విస్తుగొలిపే అంశం. హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లిలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో ఓ మహిళా అభ్యర్థి కాపీయింగ్ చేస్తూ అధికారులకు పట్టుబడ్డారు.


ఇస్లావత్‌ లక్ష్మీ అనే అభ్యర్థి తన చీర కొంగులో చిట్టీలు కట్టుకొని వచ్చినట్లు అధికారులు గుర్తించారు. చిట్టీలు చూస్తూ పరీక్ష రాస్తుండగా అధికారులు గుర్తించారు. కాపీయింగ్ చేస్తుండగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్‌లో ఎస్‌జీటీ టీచర్‌గా ఇస్లావత్‌ లక్ష్మీ పనిచేస్తున్నారు. ఆమె స్వస్థలం వనపర్తి జిల్లా పెద్దమామిడి మండలం గట్ల ఖానాపూర్ గ్రామం అని తెలుస్తోంది. టీజీపీఎస్‌ఈ నిబంధనల ప్రకారం లక్ష్మిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.


మొన్నటిదాకా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల వాయిదా కోసం అభ్యర్థులు చేసిన ఆందోళన చర్చనీయాంశం కాగా.. ఇప్పుడు ఆ పరీక్షల్లో కాపీయింగ్ కలకలం రేపుతోంది. ఈ ఘటన ద్వారా టీజీపీఎస్సీ డొల్లతనం మరోసారి బయటపడిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. గతంలో గ్రూప్ 1 పరీక్షా పేపర్ల లీకేజీ, పరీక్షలు రాసిన తర్వాత నోటిఫికేషన్ రద్దు చేసిన ఘటనలను గుర్తుచేసుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలను 30 వేల మందికి పైగా అభ్యర్థులు రాస్తున్నారు. అక్టోబర్ 21న ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 27 వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణ కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లిలోని సీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ పరీక్షా కేంద్రంలో కాపీయింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com