ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 10:40 PM

తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన విషయం తెలిసిందే. ఈ వాయుగుండం తుపానుగా మారగా.. దానికి 'దానా' అని పేరు పెట్టారు. ఈ దానా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ప్రధానంగా రెండు జిల్లాలపై దానా తుపాను ఉండే అవకాశం ఉందన్నారు.


ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలపై దానా ప్రభావం ఉంటుందని ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ వాతావరణం విషయానికొస్తే.. నగరంలో పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు. మేఘాలు వస్తూ పోతూ ఉంటాయని.. సాయంత్రానికి వాతావరణం పూర్తి చల్లబడుతుందని చెబుతున్నారు. నగరానికి భారీ వర్ష సూచన లేదు కానీ.. పలు ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉందని అన్నారు.


దానా తుపాను ప్రభావంతో పొరుగు రాష్ట్రమైన ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తీర ప్రాంత జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. తీరం వెంట బలమైన ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. వచ్చే మూడ్రోజులు ఏపీ వ్యాప్తంగాతేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుసే ఛాన్స్ ఉందన్నారు. ప్రస్తుతం సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.


ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఒడిశాలోని బిత్తర్‌కనిక‌లోని హబలిఖాటి జాతీయ పార్క్‌, ధమ్రా మధ్య తీరం దాటినట్లు చెప్పింది. నేడు మధ్యాహ్నం 12 గంటల వరకు తీవ్ర తుఫానుగా కొనసాగి తర్వాత బలహీనపడి తుఫానుగా మారుతుందన్నారు. సాయంత్రానికి మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందన్నారు. ఈ తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని ఐఎండీ అధికారులు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించారు. రెండు రాష్ట్రాల్లో దాదాపు 400 ట్రైన్లను రద్దు చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలను నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com