కొత్తగా ఏర్పడిన తెలంగాణ స్టార్టప్ స్టేట్గా ఎదుగుతుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. కొత్తగా వచ్చే ఏ టెక్నాలజీ అయిన సమాజానికి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ శాఖల్లో టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకెళ్తున్నామని తెలిపారు. టెక్నాలజీతో ఎన్నో అద్భుతాలు చేయొచ్చని చెప్పారు. భారత్లో తొలిసారి టెలిమెడిసిన్ను ఇక్కడే ప్రారంభించామని గుర్తు చేశారు. టీ ఫైబర్తో ఇండ్లు, స్కూళ్లు, పీహెచ్సీలను అనుసంధానం చేస్తామని వెల్లడించారు. ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నాణ్యమైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. గ్రామాల్లో కూడా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నాం. ప్రతి ఆస్పత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు ఉన్నాయని మంత్రి తెలిపారు.రాష్ట్రంలో పాఠశాలల డిజిటలైజేషన్ ప్రారంభించామని మినిస్టర్ కేటీఆర్ తెలిపారు. మైక్రోసాఫ్ట్తో కలిసి రాష్ట్రంలో ప్రతి పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలు చేయనున్నామని వెల్లడించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు పోతున్నదని ఉద్ఘాటించారు. ప్రభుత్వంతో పాటు ప్రయివేటు సెక్టార్ కంపెనీలు కూడా సామాజిక బాధ్యత కింద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.