కొద్ది రోజుల కిందట అస్వస్థతకు గురైన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ (62) ముంబైలోని లీలావతి ఆసుపత్రి నుంచి గురువారం డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. కానీ, ఆయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం పొత్తి కడుపులో తీవ్రనొప్పి రావటంతో గోవా మెడికల్ కాలేజి ఆస్పత్రిలో చేరారు. ఆయన డీహైడ్రేషన్తో బాధపడుతున్నారని గోవా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే వెల్లడించారు. గత బుధవారం ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అనారోగ్యం పాలైన పారికర్ ముందుగా గోవా మెడికల్ కాలేజీలో చికిత్స పొందారు. కానీ మెరుగైన వైద్యం కోసం ముంబైలోని లీలావతి హాస్పిటల్కు తరలించారు. దీంతో పారికర్కు ప్యాంక్రియాటిక్ కేన్సర్ సోకిందని, అది నాలుగో దశలో ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ముంబై వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయనను పరామర్శించారు.
పారికర్ పరిస్థితి విషమంగా ఉందని కొన్ని చానెళ్లు ప్రసారం చేయగా.. చనిపోయారని కూడా కొన్ని న్యూస్ ఛానెళ్లు, వెబ్సైట్లు వార్తలు ప్రసారం చేశాయి. పారికర్కు కేన్సర్ సోకిందనే వార్తలు అబద్ధమని లీలావతి హాస్పిటల్ ఓ ప్రకటన విడుదల చేసింది. రొటీన్ చెకప్లో భాగంగా ముఖ్యమంత్రి ముంబైలో ఉన్నారని సీఎం కార్యాలయం కూడా ప్రకటించింది. రెండ్రోజులపాటు ఆయన అందుబాటులో ఉండరు. రొటీన్ చెకప్లో భాగంగా ముంబైలో ఉన్నారని తెలిపింది. హాస్పిటల్ నుంచి పారికర్ డిశ్చార్జ్ అయిన రోజే బడ్జెట్ ప్రవేశపెట్టడంతో అసెంబ్లీకి వచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన రోజువారీ విధులకు హాజరవుతానని, కానీ వైద్యుల సూచన మేరకు కొద్ది రోజుల పాటు కొద్ది మందిని కలుసుకుంటానని అన్నారు. మరోవైపు పారికార్ ఆరోగ్యంపై పనాజీలోని చర్చ్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa