కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇండియా టుడే కాన్క్లేవ్ 2018లో పాల్గొన్న ఆమె.. మోదీ హయాంలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, తమ నోరు నొక్కేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం దేశం తిరోగమన పథంలో ఉందని పేర్కొన్నారు. భాజపా హయాంలో అసహనం పెరిగిపోయిందని అన్నారు. భయం, బెదిరింపులు, మత ఘర్షణలు ఎక్కువవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటులో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదని ఆరోపించారు. ఇక పార్లమెంటు మూసేస్తే.. మేమంతా ఇంటికి వెళ్లిపోతాం అని అన్నారు. వాజ్పేయి హయాంలో మాదిరిగా పార్లమెంటు కార్యకలాపాలు గౌరవప్రదంగా ఉండట్లేదని వ్యాఖ్యానించారు.
‘భాజపా హయాంలో ఆర్థికాభివృద్ధి గణనీయంగా ఉందని చెబుతున్నారు. 2014 మే 26కు ముందు భారత్ ఏమైనా అగాథంలో కూరుకుపోయి ఉందా? ఈ నాలుగేళ్లలోనే భారత్ అభివృద్ధి, గొప్పదనం సాధించిందా? ఇలా చెప్పుకోవడం భారత ప్రజల మేధస్సుకు అవమానం కాదా?’ అని సోనియా ప్రశ్నించారు. మన న్యాయవ్యవస్థ ప్రస్తుతం సంక్షోభంలో ఉందన్నారు. తమపై చేస్తున్న అవినీతి ఆరోపణలు చాలా ఎక్కువ చేసి చూపుతున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను, చర్చలను అంగీకరించాలని, ఏకపాత్రాభినయాన్ని కాదని సోనియా వ్యాఖ్యానించారు.
ప్రజలతో అనుసంధానమయ్యేందుకు కొత్త పద్ధతిని ఎంచుకోవాలని భావిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోందని సోనియా అన్నారు. తిరిగి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు తమ హయాంలోని పాలసీలను, ప్రాజెక్టులను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే విషయంపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ప్రజల మద్దతు కూడగట్టుకోవాల్సిన అవసరముందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయాలా వద్దా అనే అంశాన్ని పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు. మన్మోహన్ తన కంటే మంచి ప్రధాని అవుతారని తనకు తెలుసని, తన పరిమితులు తనకు తెలుసని సోనియా అన్నారు. అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సోనియా ఆశాభావం వ్యక్తంచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa