హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నేడు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నియోజకవర్గంలోని పిట్లం మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి గులాబీ కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే గంప గోవర్దన్, హన్మంత్ షిండే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, అమలు అవుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో భారీగా చేరుతున్నరన్నారు. సంక్షేమ పథకాల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో అందరినీ కలుపుకొని బంగారు తెలంగాణ సాదించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. మిషన్ భగీరధ ద్వారా సింగూర్ నుండి జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు త్రాగునీరు సరఫరా మొదలైందని మంత్రి తెలిపారు. 35 వేలకు పైగా ఎకరాలకు సాగునీరు అందించే నాగమడుగు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి త్వరలోనే అన్ని అనుమతులు తీసుకుని పనులు ప్రారంభిస్తామన్నారు. వచ్చే వానాకాలం నుండి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్ళు నిజాంసాగర్ లోకి వస్తాయి. 365 రోజులు నీళ్ళు నిల్వ ఉంచి నిజాంసాగర్ కు గత వైభవం తీసుకువస్తామని మంత్రి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa