ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసుల అదుపులో యువత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 15, 2018, 10:57 AM

తాము నివసిస్తున్న గదిలో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఖానాపురంహవేలి సీఐ కె.నాగేంద్రాచారి తెలిపారు. వారిలో ఇద్దరు యువకులు, ముగ్గురు మైనర్లు ఉన్నారని ఆయన చెప్పారు. సీఐ తెలిపిన కథనం ప్రకారం.. ఖానాపురానికి చెందిన అభిలాష్‌ అనే యువకుడు నగరంలోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తున్నాడు. శ్రీశ్రీ సర్కిల్‌లో ఓ గది అద్దెకు తీసుకుని తన స్నేహితులు నలుగురితో కలిసి ఉంటున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు వారి ఇంటిలో తనిఖీలు చేపట్టి గంజాయి తాగుతుండగా పట్టుకున్నామన్నారు. వారిలో అభిలాష్‌తోపాటు పాండురంగాపురానికి చెందిన సోహైల్‌(ముబీన్‌), మరో ముగ్గురు మైనర్లు ఉన్నారు. సోహైల్‌ ఓ ప్రయివేటు కళాశాలలో ఐటీఐ చేస్తున్నాడు. వారి నుంచి పావుకిలో గంజాయి, రెండు హుక్కాలు, గంజాయి నలిపే మర, చాకు స్వాధీనం చేసుకున్నామని, వారిని బుధవారం న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు సీఐ వివరించారు.


నగరంలో విచ్చలవిడిగా అమ్మకాలు 


ఖమ్మం నగరంలో కొందరు వ్యక్తులు గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలకు పాల్పడుతున్నారని సమాచారం. సంపాదనే ధ్యేయంగా ప్రణాళిక ప్రకారం యువత, బాలలను గంజాయికి బానిసలుగా చేసి విక్రయాలు పెంచుకుంటున్నారని తెలుస్తోంది. బాలల భవిష్యత్తును అంధకారం చేస్తూ పాఠశాలలు, కళాశాలల వద్ద అడ్డాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఖానాపురంహవేలి పోలీసులకు పట్టుబడిన ఐదుగురిలో ముగ్గురు మైనర్లు కాగా, మిగిలిన ఇద్దరు 20ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. గంజాయిని ఖమ్మం నగరంలోని రైల్వే స్టేషన్‌, బస్టాండు, ఎన్టీఆర్‌ సర్కిల్‌, కాల్వొడ్డు వంటి ప్రాంతాలలో విక్రయాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు దీనిపై దృష్టిసారిస్తే ఈ దందాకు పాల్పడే వారు తేలికగా చిక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa