ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యే కొడుకు బెదిరింపులు.. కుటుంబం ఆత్మహత్యాయత్నం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 03, 2018, 09:33 AM

తనకు ఎమ్మెల్యే కొడుకు మూడు కోట్ల రూపాయల బాకీ ఉన్నాడని, దాన్ని చెల్లించమని అడిగితే బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఓ వ్యక్తి తన కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నం చేశాడు. సోమవారం సాయంత్రం మంచిర్యాల పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడికి, మంచిర్యాలకు చెందిన బాధితుడు అరవింద్‌కు వ్యాపారా సంబంధాలు ఉన్నాయి. అరవింద్‌కు చెందిన స్వర్ణమయి షాపింగ్ మాల్‌ను ఎమ్మెల్యే తనయుడు అక్టోబరు 2016లో రూ.1.16 కోట్లకు కొనుగోలు చేశాడు. అయితే ఇప్పటి వరకు ఆ డబ్బులు చెల్లించలేదు సరికదా బెదిరింపుల పాల్పడుతున్నాడని బాధితుడు ఆరోపించాడు. అలాగే తన తండ్రికి చెందిన బోర్‌వెల్స్‌తో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో బోర్లు వేయించి, దీనికి మొత్తం రూ.2 కోట్లు బాకీ ఉన్నా తీర్చడం లేదని, అడిగితే బిల్లులు రావడంలేదని కాలయాపన చేస్తున్నాడని అతడు పేర్కొన్నాడు. 


వీటి గురించి చాలా సార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా బాకీలు తీర్చలేదు.. రాత్రికి రాత్రే స్వర్ణమయి మాల్‌లో వస్త్రాలు, ఏసీలను అమ్మోశాడని తెలిపాడు. ఇదేంటి అడితే దిక్కున్నచోట చెప్పుకోమని బెదిరింపులకు పాల్పడినట్టు బాధితుడు తెలియజేశాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అరవింద్ తన భార్య, కుమారుడితో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ట్రాక్ పై రైలుకు ఎదురెళ్తున్న వారిని గమనించిన స్థానికులు అడ్డుకుని, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాధితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. తమ బాకీ తిరిగి చెల్లించాలని డిమాండ్ చేయడంతో బెదిరింపులు, వేధింపులకు దిగుతున్నాడని అరవింద్ ఆరోపించారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఉపయోగం ఉండడం లేదని అన్నాడు. తన దగ్గర ఆధారాలున్నప్పటికీ ప్రజాప్రతినిధి కొడుకు కావడంతో న్యాయం జరగడంలేదని బాధితుడు వాపోయాడు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa