ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొనసాగుతోన్న కేజ్రీవాల్ నిరసన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 13, 2018, 09:54 AM

తమ డిమాండ్లకు లెఫ్టినెంట్ గవర్నర్ అంగీకరించనందుకు ఆయన నివాసంలోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మరో ముగ్గురు మంత్రులు సోమవారం సాయంత్రం నుంచి నిరసన తెలియజేస్తున్నారు. గత రెండు రాత్రుల నుంచి వారంతా గవర్నర్ బంగ్లా రాజ్‌ నివాస్‌లోని వెయిటింగ్ హాల్‌లో భీష్మించుకు కూర్చున్నారు. దేశ ప్రజాస్వామ చరిత్రలోనే ఇది అపూర్వమైన నిరసన. సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన మంత్రివర్గ సహచరులతో కలిసి సోమవారం సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌ను కలవడానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించిన మూడు అంశాలపై ఎల్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తమ డిమాండ్లకు ఆమోదం తెలిపేవరకూ వరకూ ఇక్కడ నుంచి కదిలేది లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దీనిపై కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ.. ‘ఢిల్లీ ప్రజల హక్కుల కోసం, అభివృద్ధి కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. 


‘గవర్నర్ నివాసంలో రెండో రాత్రి కూడా మా నిరసన సాగింది... మేము ఢిల్లీని ప్రేమిస్తున్నాం.. ఢిల్లీ అభివృద్ధిపై శ్రద్ధ వహించి, ఎంతగానో కృషి చేస్తున్నాం.. ఢిల్లీ మరింత మెరుగు పడాలని మేము కోరుకుంటున్నాం, అనేక మంచి కార్యక్రమాలను ప్రారంభించాలనుకుంటున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. గవర్నర్ నివాసంలో కేజ్రీవాల్‌తోపాటు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, హోం మంత్రి సత్యేందర్ జైన్, కార్మిక మంత్రి గోపాల్ రాయ్‌లు రెండు రోజుల నుంచి నిరసన చేస్తున్నట్టు ఆప్ వర్గాలు వెల్లడించాయి. వెయిటింగ్ రూమ్‌లోని సోఫాలపైనే నిద్రపోతూ అందులోని టాయిలెట్స్‌నే వినియోగిస్తున్నారు. వీరికి దిండులు, దుప్పట్లతోపాటు ఆహారం కేజ్రీవాల్ ఇంటి నుంచి పంపుతున్నారు. రాజ్‌నివాస్‌లో కేవలం టీ మాత్రమే అందజేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలియజేశాయి. లెఫ్టినెంట్ గవర్నర్‌ బయట కార్యక్రమాలలో పాల్గోవడంతో మంగళవారం నాడు సీఎం కేజ్రీవాల్‌తో భేటీ కాలేదు. సోమవారం సాయంత్రం ఎల్జీతో సమావేశం అనంతరం ఆ నలుగురూ రాజ్ నివాస్‌లో ధర్నాకు దిగారు. 


రాజ్‌నివాస్‌లోనే మంత్రి సత్యేందర్ జైన్ మంగళవారం ఆమర నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష తనకు తానుగా చేయలేదని, ఢిల్లీ ప్రజల కోసం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. గత ఫిబ్రవరి 21 న ఆప్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో, సీఎం సమక్షంలోనే తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఢిల్లీ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది ఐఏఎస్‌ల నాలుగు నెలల నుంచి విధులకు సక్రమంగా హాజరు కావడం లేదు. ఒకవేళ, వీరిపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా భయపడాల్సిన అవసరం లేదని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీచేయడం కొత్త వివాదానికి దారితీసింది. విధులకు హాజరుకాని అధికారులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని సీఎం డిమాండ్ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com