ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీహెచ్ఎంసీలో కుంభకోణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 06, 2017, 12:01 PM

జీహెచ్ఎంసీ ( గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ )లో రూ.1.1 కోటి విలువైన భారీ కుంభకోణం వెలుగుచూసింది. నాలాల పూడికతీత పనులకి సంబంధించి నకిలీ బిల్లులతో రూ.1.1 కోటి జీహెచ్ఎంసీ నిధులు స్వాహా అయినట్టు గుర్తించిన సంస్థ సెంట్రల్ జోన్ సూపరింటెండింగ్ ఇంజినీర్ మోహన్ సింగ్ సీసీఎస్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 2వ వారంలో ఈ పిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఈ కేసుకి సంబంధించి నిన్న శుక్రవారం 12 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లని అరెస్ట్ చేశారు.అరెస్ట్ అయినవారిలో ఇదే సెంట్రల్ జోన్‌కి చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు శంకర్, సంతోష్, పాపమ్మ, శ్రీనివాస్, అశోక్, కామేశ్వరి, లాల్ సింగ్, మోహన్ రావు, వశీధర్, ప్రేరణ, నాయుడు, జమీల్ వున్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పటికీ... అరెస్ట్ అయిన వారిని మాత్రం ఆ తర్వాత స్టేషన్ బెయిల్‌పై విడిచిపెట్టారు.


ఈ కుంభకోణంపై స్పందించిన మోహన్ సింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. నిజానిజాలపై దర్యాప్తు జరిపించాల్సిందిగా కోరుతూ పోలీసులకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, మెహిదీపట్నం, ముషీరాబాద్, అంబర్‌పేట్ ప్రాంతాల్లో నాలాల్లో పూడికతీత పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నకిలీ వెయింగ్ బిల్లులతో నిధులు స్వాహా చేసినట్టు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ద్విచక్రవాహనాలు, ఆటోలు, టాటా సుమోల పేరిట వున్న వాహానాల రిజిస్టేషన్ల నెంబర్లని ఈ బిల్లులలో పేర్కొన్నట్టు విచారణలో స్పష్టమైంది.ఈ కేసు దర్యాప్తులో భాగంగా జీహెచ్ఎంసీలో కాంట్రాక్టర్లుగా పనిచేస్తోన్న పీ ప్రవీణ్ కుమార్, పీ రాజు, ఎస్ శ్రీనివాస్ రెడ్డి, తాడూరి రామచంద్రా రెడ్డి, వేముల మల్లేష్, ఈ వేణుగోపాల్, బోదాసు వెంకటేష్, బొంత శ్రీనివాస్, వరికుప్పల శ్రీనివాస్, బీ శేఖర్, వీ మహేష్, బొంత మల్లేష్, వి కృష్ణ, వరికుప్పల యాదయ్య, బీ ఎల్లయ్య, వరికుప్పల రవి, యాపర్ల చక్రవర్తి, గండికోట నరేందర్‌లని పోలీసులు ఏప్రిల్ 28నే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జరిగిన విచారణలోనే వీళ్లు సమర్పించిన బిల్లులపై సంతకాలు చేసి ఆమోదించిన ఈ 12 మంది ఏఈఈలని పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com